హైదరాబాద్ సిటీ పరిధిలోని చదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక తీవ్రమైన పోక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు విజయాన్ని సాధించారు. నాంపల్లిలోని XII అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి. అనిత ఈ కేసులో సంచలన తీర్పును వెలువరించారు.
కేసు వివరాల ప్రకారం, పాత మలక్పేట, శంకర్ నగర్ ప్రాంతానికి చెందిన సంగం మనోహర్ (20) అనే నిందితుడు 2021లో ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి, తన అనారోగ్యాన్ని సాకుగా చూపి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదనంగా, బాధితురాలి అసభ్యకర వీడియోలు, ఫోటోలు తీసి బంధువులకు పంపుతూ, పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై 2021లో చదర్ఘాట్ పోలీసులు క్రైమ్ నంబర్ 320/2021 కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు, నిందితుడు మనోహర్ను దోషిగా నిర్ధారిస్తూ 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే 5,000 రూపాయల జరిమానా విధించగా, అది చెల్లించని పక్షంలో మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
బాధితురాలి ఆర్థిక పరిస్థితి మరియు కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, 5 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేయాలని కోర్టు సిఫార్సు చేసింది.
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన రిటైర్డ్ అడిషనల్ డీసీపీ పి. దేవేందర్, ప్రాసిక్యూటర్లు ఎ. రాంరెడ్డి, జె. రామకృష్ణ మరియు సహకరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.
ఈ మేరకు చదర్ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. బి. మురారి ప్రకటన విడుదల చేశారు.
