హైదరాబాద్, మార్చి 25: నగరంలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
ఇంధన సరఫరాపై ఏర్పడిన అపోహల నేపథ్యంలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన సీపీ, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. నగరవ్యాప్తంగా ఇంధన సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని వెల్లడించారు. అయితే, పుకార్ల ప్రభావంతో ప్రజలు ఒకేసారి పెట్రోల్ బంకులకు చేరుకొని వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు.
తప్పుడు ప్రచారాల ప్రభావంతో ఇంధన వినియోగం ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న అది 6,400 కిలోలీటర్లకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ, ఆయిల్ సంస్థలు మరియు సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నగరంలోని ఎక్కువ భాగం పెట్రోల్ బంకుల్లో సరఫరా సజావుగా కొనసాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని విజ్ఞప్తి చేశారు.
