హైదరాబాద్, మార్చి 25: నగరంలోని కాటెదాన్ ప్రాంతంలో పిల్లల తినుబండారాల తయారీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు మరియు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్న అక్రమ యూనిట్ను మైలార్దేవ్పల్లి పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్. శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన మెరుపు దాడిలో “మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ” పేరుతో నడుస్తున్న ఈ కేంద్రాన్ని గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32), మరియు ఖత్రేషన్ ఉన్నారు. వీరు కాటెదాన్లోని ఇంద్ర సొసైటీ పరిధిలో అనుమతి లేకుండా ఆహార తయారీ కేంద్రాన్ని నడుపుతూ, బయట మార్కెట్ నుండి కుళ్లిపోయిన మరియు పగిలిపోయిన కోడిగుడ్లను సేకరించి వాటికి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి డోనట్స్, కేకులు తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఆహార పదార్థాలు అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారవుతున్నాయని, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే అవకాశముందని అధికారులు తెలిపారు. దాడిలో భాగంగా పోలీసులు సుమారు 330 కుళ్లిపోయిన కోడిగుడ్లు, సోడియం బెంజోయేట్ (15 కిలోలు), సోర్బిక్ యాసిడ్ (15 కిలోలు), పొటాషియం సోర్బేట్ (20 కిలోలు), పీజీపీఆర్ లిక్విడ్, అమ్మోనియా సల్ఫైట్ వంటి రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తయారైన డోనట్స్, కేకులు సుమారు 150 కిలోలు, డాల్డా 120 కిలోలు, మిల్క్ పౌడర్ 25 కిలోలు, మిక్సింగ్ మెషీన్లు, స్పైరల్ మెషీన్, ఓవెన్లు, వెయింగ్ మెషీన్లను కూడా సీజ్ చేశారు.
నిందితులపై మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 268/2026 కింద కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని అధికారులు అభినందించారు.




