
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ అడ్డాకల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి మరియు స్టేషన్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండి, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “అర్రైవ్ అలైవ్ (Arrive Alive)” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అని, హెల్మెట్ వినియోగం, అతివేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే విషయాలపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇకపోతే, ప్రస్తుతం ప్రారంభమవుతున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, చిన్నపిల్లలు సెలవుల సమయంలో అజాగ్రత్తగా ప్రమాదకర చర్యల్లో పాల్గొనకుండా ఉండేలా తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించాలని అడ్డాకల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కి సూచించారు. ముఖ్యంగా నీటి ప్రాంతాలు, అగ్ని సంబంధిత ప్రమాదాలు మరియు ఇతర అనవసర కార్యకలాపాల నుండి పిల్లలను దూరంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డాకల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
