
ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండి, జీవితాలను ఇబ్బందులకు గురి చేయకూడదని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నమోదై, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మరియు రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీ పడేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడదగిన కేసులు: క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు తదితరాల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీ కుదుర్చుకోవచ్చు. సైబర్ నేరాల విషయంలో, బాధితులు కోల్పోయిన డబ్బులను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ.25,000/- కంటే తక్కువ మొత్తాన్ని కోల్పోయిన సందర్భంలో లోక్ అదాలత్ లో ఫిర్యాదు చేసి, కోర్ట్ అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే రీఫండ్ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన మరియు సులభమైన పరిష్కారం లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
