నిషేధిత ‘చైనీస్ మాంజా’పై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..!
బాలానగర్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ షురూ..
అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు – ఏసీపీ నరేష్ రెడ్డి
నిషేధిత చైనీస్ మాంజా (Chinese Manja) అక్రమ అమ్మకాలు, పంపిణీని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పర్యవేక్షణలో బాలానగర్ డివిజన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించారు.
ఈ స్పెషల్ ఆపరేషన్ వివరాలను బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. “బాలానగర్ డివిజన్ పరిధిలో చైనీస్ మాంజా అమ్మకం, వినియోగం, నిల్వ లేదా రవాణాలో పాల్గొన్న వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్బంగా ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ… చైనీస్ మాంజాను విక్రయించినా, గాలిపటాలు ఎగరేసేందుకు ఉపయోగించినా… సదరు వ్యక్తులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ప్రతి సంక్రాంతికి ఈ ప్రమాదకరమైన మాంజా కారణంగా ఎంతో మంది మనుషులు చనిపోతున్నారు లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. ముఖ్యంగా పక్షులకు, పర్యావరణానికి ఇది తీవ్ర నష్టం కలిగిస్తుంది అన్నారు. పతంగి దుకాణాల యజమానులు పోలీసుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే, వారు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

పిల్లలకు చైనీస్ మాంజా వాళ్ళ కలిగే నష్టాలను తల్లిదండ్రులు విధిగా వివరించి వారికి అవగాహన కల్పించాలన్నారు. “ప్రజలు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించాలని, చైనీస్ మాంజా విక్రయాలు లేదా నిల్వ గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారం లేకుండా ఈ ప్రమాదాన్ని పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని,” ఏసీపీ నరేష్ రెడ్డి ప్రజలను కోరారు.
