ప్రశాంత వాతావరణం లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా పూర్తి భద్రత కల్పించాలని సూచనలు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి నిర్వహించాలి..

గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణం
ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని జోన్-VI డీఐజి ఎల్.ఎస్. చౌహన్ అన్నారు.
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు దేవరకొండలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో కలిసి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అధికారులు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన బాధ్యతలపై అవగాహన కల్పించారు.

జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అదనపు పోలీస్ బందోబస్తు, నిరంతర గస్తీ, పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డీఐజి ఆదేశించారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజలతో సమన్వయం పెంచుతూ ఓటర్లకు పూర్తి భద్రతా భరోసా కల్పించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రజలు భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
