
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనర్, ఐపీఎస్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, మాదన్నపేట పోలీస్ స్టేషన్ సందర్శించడం ఇదే మొదటి సారి. ఈ సందర్శన సందర్భంగా వివిధ కేసుల పురోగతి, పోలీసింగ్ విధానాలు, సామాజిక-మత పరిస్థితులు మరియు ఇతర అంశాలను సమీక్షించారు. కమిషనర్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై, వారి రోజువారీ విధులు, హాజరు, క్రమశిక్షణ గురించి ఆరా తీశారు. అలాగే పోలీస్ స్టేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నాము. ఈ నూతన విధానం నగర ప్రజల భద్రతకు ఎంతగానో దోహదపడుతుంది. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్-రోడ్డు భద్రత, మహిళా-చిన్నారుల రక్షణ, టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, సైబర్ క్రైమ్స్ మరియు ఆర్థిక నేరాల నియంత్రణ, 24/7 సిటిజన్ సర్వీసెస్ మరియు సిబ్బంది సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంచడం మనందరి ప్రధాన బాధ్యత. విధుల్లో క్రమశిక్షణగా, అంకితభావంతో వ్యవహరించాలి. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే సిబ్బందిని గుర్తించి ప్రోత్సహిస్తాం. అలాగే తప్పు చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడము.” అని పేర్కొన్నారు. మరియు “పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా ప్రవర్తించాలి. వారికి తగిన న్యాయం జరగేలా చూడాలి. కేసుల నమోదులో ఎటువంటి నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదు. మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే కేసు నమోదు చేసి, ఆలస్యం చేయకుండా విచారణ చేపట్టి చార్జ్షీట్ త్వరగా దాఖలు చేయాలి. ప్రతి ఫిర్యాదుదారుడు సంతృప్తిగా స్టేషన్ నుంచి వెళ్లేలా చూడాలి.” అని సూచించారు. ఇటీవల సుమయ్య హత్య కేసులో నిర్వహించిన చురుకైన విచారణ, త్వరిత గుర్తింపు మరియు అరెస్టులు కారణంగా బాధితురాలి తండ్రి అజీమ్ఉద్దీన్ ఫారూక్ కమిషనర్ ని వ్యక్తిగతంగా కలసి ధన్యవాదాలు తెలిపారు. తరువాత కమిషనర్ మదన్నపేట పరిధిలోని సున్నిత ప్రాంతాలను పరిశీలించి, పికెట్లు, సీసీ కెమెరాలు మరియు పోలీసుల సిద్ధస్థితిని సమీక్షించారు. ఆయన స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలు, శ్రేయస్సు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) శ్రీమతి అపూర్వ రావు, ఐపీఎస్, డీసీపీ (సౌత్ ఈస్ట్ జోన్) చైతన్య కుమార్, ఐపీఎస్, అదనపు డీసీపీ కె. శ్రీకాంత్, ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు అంజనేయులు మరియు శ్రీను నాయిక్ తదితరులు పాల్గొన్నారు.

