
నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో, సి.వి. ఆనంద్ ఐపీఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాదు అధ్యక్షతన గణేష్ నిమజ్జనం బందోబస్తుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు, నిమజ్జనం సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విగ్రహాల దొంగతనం వంటి నేరాలను నివారించడానికి స్థానిక పోలీసులు, వాలంటీర్లు నిరంతరం నిఘా ఉంచాలి. సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లోని విగ్రహాల నిమజ్జనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలు సృష్టించే వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల వంటి పొరుగు ప్రాంతాల నుండి వచ్చే విగ్రహాల వాహనాలకు సరైన పోలీసు ఎస్కార్ట్ ఉండేలా చూడాలని తెలిపారు. రాత్రిపూట విగ్రహాల వద్ద నిర్వాహకులు లేదా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. గతంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో జరిగిన లోటుపాట్ల గురించి, శాంతిభద్రతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గణేష్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించి, అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సమావేశం అనంతరం నార్త్ జోన్ లోని ముఖ్యమైన గణేష్ మండపాల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి, మండపాల నిర్వాహకులతో మరియు వాలంటీర్లతో మాట్లాడారు. ఆయా మండపాల వద్ద భద్రతను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. వర్షాలు పడుతున్నందున మండపాల నిర్వాహకులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిచో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారికి సుచించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా భక్తులు, ప్రజలు అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో శ్రీమతి ఎస్. రశ్మి పెరుమాల్ ఐపీఎస్ (డీసీపీ, నార్త్ జోన్), శ్రీమతి కె. అపూర్వ రావు ఐపీఎస్ (డీసీపీ, ఎస్.బి), బి.కె. రాహుల్ హెడ్గే ఐపీఎస్ (డీసీపీ, ట్రాఫిక్),వైవిఎస్.సుదీన్ద్రా డిసిపి టాస్క్ ఫోర్స్, అడిషినల్ డిసిపిలు మరియు నార్త్ జోన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.
