
జిల్లా పోలీసు శాఖలో దాదాపు 37 సంవత్సరాల పాటు పని చేస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్ఐ యం.డి జాఫర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్.బక్కయ్యలను జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయం అని అన్నారు. మీ యొక్క సేవలు, అనుభవాలు పోలీస్ శాఖకు చాలా అవసరం ఉంటాయని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజం అని, పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు. పదవి విరమణ పొందిన అనంతరం కూడా పోలీసు కుటుంబ సభ్యులేనని, ఏలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నారు. అనంతరం వారికీ అందవలసిన ఆర్దిక సదుపాయాలను అందజేశారు. అనంతరం గత సంవత్సరం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ గుండె పోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ మోహన్ సతీమణి స్వాతి చేయూత ద్వారా రెండు లక్షల రూపాయలు అందజేసి జిల్లా యస్.పి పరామర్శించి, మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
