
సి.వి. ఆనంద్, ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, గణేష్ చతుర్థి మరియు మిలాద్-ఉన్-నబీ పండుగలను శాంతియుతంగా జరుపుకునేందుకు హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్ల సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో బంజారా హిల్స్లోని టీజి.ఐసిసిసి ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, పోలీసుల మధ్య సత్సంబంధాలు మెరుగు పరుచు కోవాలని తెలిపారు. ఏదైనా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల ద్వారా సమస్యను సులువుగా పరిష్కరించవచ్చని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులకు మద్దతుగా ఉంటూ, రాబోయే పండుగలు శాంతియుత వాతావరణంలో జరిగేలా, సమాజంలోని సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి, ప్రజల్లో సామరస్య భావం, ఐక్యత నెలకొల్పే విధంగా తమ కమిటీ సభ్యులు పనిచేస్తారని తెలిపారు. కేవలం పండుగలకే కాకుండా సమాజంలో జరిగే ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలను కూడా అరికట్టడానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు హైదరాబాద్ నగరంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 1500 మంది పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉన్నారని కమిషనర్ పేర్కొన్నారు. వివిధ మత సమూహాల మధ్య అవగాహన మరియు సహకారాన్ని పెంపొందించేందుకు సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఎంతో దోహదపడుతుందని, హైదరాబాద్ నగరం ‘గంగా-జమునా తెహజీబ్ను’ (వివిధ మతాల మధ్య సామరస్యం) నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కూడా తమ ఏరియాలో శాంతిని నెలకొల్పడానికి పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల సేవలు ఎంతైనా అవసరమని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించడానికి స్థానిక పోలీసులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ ఖ్యాతిని కాపాడేందుకు తమ అవిశ్రాంత కృషిని కొనసాగించాలని సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులను కోరారు. వారి కృషి వల్ల నగరానికి మంచి పేరు వచ్చిందని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహకరించాలని కోరారు. పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీలో యువకులను కూడా చేర్చుకోవాలని అధికారులను, సభ్యులను కోరారు. పోలీసు అధికారులు సమాజంలోని సభ్యులతో కలిసి, వారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్తేనే సరైన పోలీసింగ్ అవుతుందని అధికారులనుద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్, అడిషనల్ సీపీ, లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ మరియు సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, శ్రీమతి కె. అపూర్వ రావు, ఐపీఎస్, డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ మరియు సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ వైస్ చైర్మన్, శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్, డీసీపీ, సౌత్ జోన్, హైదరాబాద్ మరియు సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ కో ఆర్డినేటర్, ఇతర పోలీసు అధికారులు మరియు కిషన్ శర్మ, సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ జనరల్ సెక్రటరీ, హఫీజ్ ముజాఫర్ హుస్సేన్ ,శశికాంత్ అగర్వాల్, మహ్మద్ మోజమ్ అలి,తేజో వీజయ కుమారి మరియు ఇతర ఆఫీస్ బేరర్లు, సుమారు 350 మంది శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

