మహబూబ్నగర్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఎస్పీకి ప్రత్యక్షంగా వివరించి వినతిపత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి బాధితుడి సమస్యను శ్రద్ధగా విని, వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా చట్టబద్ధమైన విధానంలో విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా, చట్టబద్ధమైన విధానంలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకువచ్చి, అవసరమైన సహాయాన్ని పొందాలని ఎస్పీ సూచించారు.
