సంగారెడ్డి: రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ హృదయపూర్వక రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలు పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరారు.
“చెల్లి కట్టే రాఖీ నీకు రక్షణ బంధం… నువ్వు ధరించే హెల్మెట్ నీ ప్రాణానికి రక్షణ కవచం. రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు.. నీ కుటుంబం కోసం కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి” అని ఎస్పీ పరితోష్ పంకజ్ సందేశం ఇచ్చారు.
మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎస్పీ తెలిపారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, మహిళలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా కొనసాగిస్తాయని చెప్పారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి రాఖీ పౌర్ణమిని సురక్షితంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
