చెర్లపల్లి: ఖైదీలలో మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు, వ్యక్తిత్వ వికాసం, పునరావాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చెర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీలో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వనంను ప్రారంభించారు.
హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద జీ వనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డీజీ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్తో పాటు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణంతో ఏర్పాటు చేసిన ఈ వనం ఖైదీలకు ఆహ్లాదకరమైన బహిరంగ వాతావరణాన్ని అందించనుంది. ఇక్కడ యోగా, ధ్యానం, సానుకూల ఆలోచనలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. పచ్చని వాతావరణంలో కొంత సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ప్రతికూల ఆలోచనలను అధిగమించి ప్రశాంతమైన, నిర్మాణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామి బోధమయానంద జీ స్వామి వివేకానంద జీవితం, బోధనలు, బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, విశ్వ సోదరభావం వంటి విలువలను వివరించారు. ఖైదీలు తమ మనసును ప్రశాంతంగా ఉంచుకుని సానుకూలంగా ఆలోచిస్తూ తమలో మంచి మార్పును తీసుకురావడానికి ఈ వనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించాలని, సామాజిక భేదాలకు అతీతంగా ఆలోచించాలని, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ, అంతర్గత బలాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. నిజమైన మార్పు మనలో నుంచే ప్రారంభమవుతుందని, సానుకూల ఆలోచనలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు, మంచి పనుల ద్వారా ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవచ్చని తెలిపారు.
ఖైదీలలో విద్య, వృత్తి శిక్షణ, పునరావాసం, ఆధ్యాత్మిక వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం కోసం తెలంగాణ జైళ్ల శాఖ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, స్వామి వివేకానంద వనం ప్రారంభం ఖైదీలలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి, వారి జీవితాలను పునర్నిర్మించేందుకు జైళ్ల శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమని తెలిపారు. యోగా, ధ్యానం, ఆత్మపరిశీలన వంటి కార్యక్రమాలు ఖైదీలలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతమైన మనస్తత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు.
నైతిక విలువలపై ప్రసంగం అనంతరం స్వామి బోధమయానంద జీ జైలు గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు. ఖైదీలు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఆత్మవికాసం, సానుకూల ఆలోచనల కోసం పఠన అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐజీ జైళ్లు వై. రాజేష్, ఐజీ జైళ్లు ఎన్. మురళీ బాబు, డీఐజీలు డా. డి. శ్రీనివాస్, ఎం. సంపత్, చెర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ జి. ప్రమోద్, చంచల్గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్, చెర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సూపరింటెండెంట్ డి. భారత్, డీఎస్పీ బి. అమరావతి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
