మూడు నెలల పాటు కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్.. 500 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్, భోజన సదుపాయం
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నియామకాలకు సిద్ధమవుతున్న మహబూబాబాద్ జిల్లా యువతీ యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్ శిబిరం ఘనంగా ప్రారంభమైంది.
ఈ శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహబూబాబాద్ జిల్లా యువతకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బద్రాద్రి జోన్ పరిధిలో కేటాయించిన పోలీస్ ఉద్యోగ ఖాళీల్లో మహబూబాబాద్ జిల్లాకు ఉన్న పోస్టులను లక్ష్యంగా చేసుకుని అభ్యర్థులు కష్టపడి సిద్ధం కావాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ సంకల్పంతో ప్రారంభించిన ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగకరమైన అవకాశమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదివి, లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ పొంది తమలోని ప్రతిభను వెలికితీసుకుని పోలీస్ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అభ్యర్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిని మరింత మెరుగుపర్చేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా నుంచి రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో యువత పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. యువతకు అవసరమైన సౌకర్యాలు, అవకాశాలు కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ శిబిరం మంచి అవకాశమని అన్నారు. పోలీస్ నియామకాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో తొలుత 1,056 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వారిలో ప్రతిభ ఆధారంగా 500 మంది అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఎంపికైన 500 మంది అభ్యర్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఉత్తమ స్థాయి శిక్షణ అందించడంతో పాటు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్, భోజన సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు.
పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొందాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, శిక్షణకు ఎంపికైన 500 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
