కాల్ డేటా, సీసీటీవీ, టోల్గేట్ ఫుటేజ్తో నిందితుడి అరెస్ట్
మహబూబ్నగర్: రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ గ్రామ శివారులో జాతీయ రహదారి NH-44 పక్కన ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున జరిగిన మహిళ హత్య కేసును మహబూబ్నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. కేసు వివరాలను మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రాజాపూర్ పోలీస్ స్టేషన్లో Cr.No.185/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళను జాత్రావత్ లాలి అలియాస్ లలిత (39), గుండ్యవల్య నాయక్ తండా, సింగాయపల్లి గ్రామం, వనపర్తి జిల్లా వాసిగా గుర్తించారు.
ఈ కేసులో మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ చోటే ఖా అలియాస్ చోటే ఖాన్ (తండ్రి: ఇషాక్ ఖాన్)ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండేళ్లుగా పరిచయం
నిందితుడి భార్య సుమారు పదేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి లారీ డ్రైవర్గా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణా చేసేవాడు. సుమారు రెండేళ్ల క్రితం మృతురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సన్నిహిత సంబంధంగా మారింది. మృతురాలిని వివాహం చేసుకొని ఆమెతో కలిసి జీవించాలని నిందితుడు కోరుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మృతురాలు కూడా నిందితుడి లారీలో బెంగళూరు, తమిళనాడు, నాగ్పూర్ తదితర ప్రాంతాలకు అతనితో కలిసి ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతురాలు ఇతర వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటోందనే అనుమానం నిందితుడిలో ఏర్పడటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
లారీ క్యాబిన్లో హత్య
హర్యానా నుంచి హోండా కంపెనీ ద్విచక్ర వాహనాలను లారీలో లోడ్ చేసుకుని కేరళకు వెళ్తున్న నిందితుడు మార్గమధ్యంలో మృతురాలికి ఫోన్ చేసి తనతో కలిసి ప్రయాణించేందుకు రావాలని కోరాడు. ఆమె అంగీకరించడంతో ప్రయాణంలో తనతో తీసుకెళ్లాడు.
బాలానగర్ సమీపంలో మృతురాలు మరో లారీలో ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు నిందితుడు గుర్తించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతడిలో అనుమానం, ఆగ్రహం మరింత పెరిగాయి.
తర్వాత మృతురాలిని తన లారీలో తీసుకెళ్లి రంగారెడ్డిగూడ సమీపంలో NH-44 పక్కన ఖాళీ ప్రదేశంలో లారీని నిలిపాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం మృతురాలు మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడటంతో మరోసారి గొడవ జరిగింది. ఈ సమయంలో ఆగ్రహానికి గురైన నిందితుడు లారీ క్యాబిన్లో ఉన్న కత్తితో మృతురాలి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం మృతదేహాన్ని లారీ నుంచి బయటకు తీసి రోడ్డు పక్కన గడ్డిలో పడవేసి బెంగళూరు వైపు పరారయ్యాడు. పోలీసులకు ఆధారాలు లభించకుండా ఉండేందుకు మృతురాలి, తన సెల్ఫోన్లను మార్గమధ్యంలో పడవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడంతో జిల్లా ఎస్పీ డి.జానకి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తొలుత మృతురాలి ఫొటోలను సోషల్ మీడియా, కరపత్రాలు, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ఆమెను గుర్తించారు.
అనంతరం మృతురాలి కాల్ డేటాను విశ్లేషించి ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడి ఫోన్ నంబర్ను గుర్తించి, అతను పనిచేస్తున్న కంపెనీ, లారీ వివరాలను పోలీసులు సేకరించారు.
సీసీటీవీ కెమెరాలు, టోల్గేట్ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ నిందితుడు ప్రయాణించిన మార్గాన్ని పోలీసులు ట్రాక్ చేశారు. అతడి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిఘా కొనసాగించారు.
ఆగస్టు 27న బెంగళూరులో కంటైనర్ను లోడ్ చేసుకుని మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న నిందితుడి కదలికలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆగస్టు 30న ఉదయం సుమారు 10 గంటలకు రాయికల్ టోల్గేట్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నేరానికి ఉపయోగించిన లారీ, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు బృందానికి అభినందనలు
జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షణలో, మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జడ్చర్ల రూరల్ సీఐ కె.మహేష్ ప్రత్యేక బృందాలతో సమర్థవంతంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు.
కేసు ఛేదనలో చురుకైన పాత్ర పోషించిన జడ్చర్ల రూరల్ సీఐ కె.మహేష్, రాజాపూర్ ఎస్ఐ ఎన్.రాజశేఖర్, పీసీలు పి.బాలచంద్రుడు, బి.వెంకటేష్, జె.బాబ్యా నాయక్, రవి కుమార్ యాదవ్లను జిల్లా ఎస్పీ డి.జానకి ప్రత్యేకంగా అభినందించారు.
