సిరిసిల్ల, జూన్ 25: మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్ నుంచి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం గాంధీ చౌరస్తాలో విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలను వివరిస్తూ నాటికలు ప్రదర్శించారు. అలాగే పోస్టర్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొని, హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యువత డ్రగ్స్కు దూరంగా ఉంటూ విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
విద్యార్థులు మరియు ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించిన అధికారులు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన శిక్షలను వివరించారు. చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు యువతను డ్రగ్స్ వైపు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వాటికి దూరంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్లైన్ 8712671111కు లేదా సమీప పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
