హైదరాబాద్, జూన్ 25: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ అన్ని జైళ్లలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఖైదీల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవన విధానాలను ప్రోత్సహించడం, పునరావాస కార్యక్రమాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ జైలులో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య మిశ్రా ‘నివృత్తి’ డీ-అడిక్షన్ సెంటర్ అధికారిక లోగోను ఆవిష్కరించారు. డ్రగ్స్ నివారణ, చికిత్స, పునరావాసంపై అవగాహన కల్పించే పోస్టర్లను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్, ప్రతిజ్ఞా స్వీకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ మధ్య వరకు హైదరాబాద్, చెర్లపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి కేంద్ర కారాగారాల్లోని డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా మొత్తం 15,645 మంది ఖైదీలకు సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4,200 మంది మాదకద్రవ్యాలపై ఆధారపడిన వారిగా గుర్తించి చికిత్స, పునరావాస సేవలు అందించారు.
స్క్రీనింగ్లో గంజాయి వినియోగం అత్యధికంగా 1,563 కేసులు నమోదుకాగా, కల్తీ కల్లు వినియోగం 815 కేసులతో ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఎండీఎంఏ, మెథాంఫెటమైన్, ఎల్ఎస్డీ, కొకైన్, ఓపియాడ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగ కేసులను కూడా గుర్తించారు.
జూన్ 26న యూఎన్వోడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ సదస్సులో తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న ‘నివృత్తి’ డీ-అడిక్షన్ కేంద్రాల ఉత్తమ విధానాలపై డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ నమూనాను ఇతర రాష్ట్రాలతో పంచుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
