పోలీసు సిబ్బంది, వారి పిల్లల కోసం గ్రంథాలయం ప్రారంభం – SPARK కార్యక్రమాన్ని అభినందించిన డీఐజీ
సంగారెడ్డి, జూన్ 23: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని డీఐజీ మల్టీ జోన్–VII, జోగులాంబ మరియు ఇన్చార్జ్ జోన్–VI, చార్మినార్ ఎల్.ఎస్. చౌహాన్, ఐపీఎస్. మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన, కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.
అనంతరం జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు చెందిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. ఆధ్వర్యంలో అమలు చేస్తున్న SPARK (Supporting Potential and Academic Rise for Khaki Personnel & Kids) కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.
పోలీసు సిబ్బంది మరియు వారి పిల్లలు పోటీ పరీక్షలకు సన్నద్ధమై అన్ని రంగాల్లో రాణించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. SPARK కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని పేర్కొంటూ, సిబ్బంది మరియు వారి పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ గ్రంథాలయం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అవసరమైన విజ్ఞానం, మార్గదర్శకత్వం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తదనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించిన డీఐజీ, ఆయా సెక్షన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది చూపుతున్న నిబద్ధతను అభినందించారు.
ప్రత్యేకంగా సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డేటా నమోదు, కేసుల అప్డేషన్, నేరస్తుల సమాచార సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై పలు కీలక సూచనలు చేశారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో నమోదు చేయడంతో పాటు డేటా నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు.
సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా దర్యాప్తు మరింత వేగవంతం కావడంతో పాటు నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించే దిశగా అధికారులు, సిబ్బంది మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మావతి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, కార్యాలయ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
