సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 1,37,042 “నేను సైతం” సీసీటీవీ కెమెరాల పనితీరు, జియో ట్యాగింగ్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కమిషనరేట్ కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో జోన్ల వారీగా కెమెరాల వివరాలను పరిశీలించారు.
జోన్ల వారీగా సీసీటీవీ కెమెరాల సంఖ్య:
- కూకట్పల్లి జోన్ – 53,424
- శేరిలింగంపల్లి జోన్ – 42,475
- కుత్బుల్లాపూర్ జోన్ – 41,143
ఈ సందర్భంగా కమిషనర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సీసీటీవీ కెమెరా సమర్థవంతంగా పనిచేసేలా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రీ-వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించి, జియో ట్యాగింగ్ వివరాలను నవీకరించాలని ఆదేశించారు.
అలాగే ప్రజలు, వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో రోడ్డు వైపు చూసేలా కనీసం ఒకటి లేదా రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో డీసీపీ స్పెషల్ బ్రాంచ్ సుధీంద్ర, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
