వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లా పోలీసు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా “స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్”పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరచడం, రికార్డులను క్రమబద్ధీకరించడం, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పోలీసింగ్ సేవలు అందించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లలో పారదర్శకతను పెంపొందించేందుకు నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు, స్టేషన్కు సంబంధించిన దాదాపు 50 రకాల ముఖ్యమైన రికార్డులు, డిజిటల్ డేటాను క్రమపద్ధతిలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. స్టేషన్లలో పని సామర్థ్యం, సేవల నాణ్యత పెంపు కోసం ‘5ఎస్’ (Sorting, Systematization, Shining, Standardization, Self-Discipline) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.
సాంకేతికత వినియోగంపై దృష్టి సారిస్తూ, మొబైల్ ఫ్రెండ్లీగా మారిన ‘సీసీటీఎన్ఎస్ 2.0’ (CCTNS 2.0)లో వంద శాతం రియల్టైమ్ డేటా నమోదు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం విలేజ్ విజిట్స్, విజిబుల్ పోలీసింగ్ను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.
శిక్షణలో భాగంగా ప్రజా రక్షణ, నిఘా వ్యవస్థను బలోపేతం చేసే ‘సురక్ష మిత్ర’, ‘రక్షణ నేత్రం’ కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలు, కాలనీల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ భద్రతా పర్యవేక్షణ నిర్వహించడమే ‘సురక్ష మిత్ర’ లక్ష్యమని తెలిపారు.
అలాగే, సాంకేతిక నిఘాను బలోపేతం చేసి నేరాలను అరికట్టేందుకు ‘రక్షణ నేత్రం’ కార్యక్రమం కింద ప్రతి వీధి, గ్రామం, పట్టణంలోని కూడళ్లలో సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేసి, వాటిని పోలీసు నిఘా పరిధిలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
సమర్థవంతమైన నాయకత్వం, పౌర స్నేహపూర్వక పోలీసింగ్కు ఒక చక్కని పోలీస్ స్టేషన్ అద్దం పడుతుందని పేర్కొంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ ఎస్. శ్రీనివాసులు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూర్ డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
