రోడ్డు భద్రతపై అవగాహన – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 27: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అశ్విని హాస్పిటల్స్ సహకారంతో మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్లకు ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ Mahesh B. Gite హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అవసరమైన డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు, మందులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రతని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనాదారుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.
దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్లు కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్పష్టమైన చూపు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు.
వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ వినియోగం వంటి నిబంధనల ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు అలసటగా ఉన్నప్పుడు వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని, ప్రతి మూడు నెలలకొకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అన్ని మండల కేంద్రాల్లో ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా అశ్విని హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్ అభినెయ్కు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐలు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్, పోలీసు సిబ్బంది మరియు వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు.

