బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు
ఇటుకబట్టీల యాజమాన్యాలు, నిర్వహులకు బాల కార్మిక చట్టాలపై అవగాహన
జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు లేబర్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటుకబట్టీల యాజమాన్యాలు, నిర్వహులతో అవగాహనా సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే జిల్లా పరిధిలోని ఇటుకబట్టీల యాజమాన్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు పిల్లలను ఏ రూపంలోనైనా పనిలో పెట్టుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలపై బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటుకబట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు చదువు, ఆరోగ్యం, భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని పేర్కొంటూ, పిల్లలను పనిలో పెట్టకుండా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
బాలకార్మికులను పనిలో పెట్టుకున్నట్లు సమాచారం అందిన పక్షంలో, పోలీస్ శాఖ మరియు లేబర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత యాజమాన్యాలపై చైల్డ్ లేబర్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాలని, ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్లైన్ లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నట్లు లేదా బాలకార్మికులుగా పనిచేస్తున్నట్లు ఎక్కడైనా గమనించినట్లయితే, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారి హరిత, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అరుంధతి, ఏ.హెచ్.టి.యూ ఎస్ఐ రంగారెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
