చిట్యాల – పెద్దకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు
— జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్.హెచ్ 65 జాతీయ రహదారి చిట్యాల – పెద్దకాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, హైవే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు చిట్యాల – పెద్దకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి, అక్కడ కొనసాగుతున్న పనులు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, వాహనాల రాకపోకలను పరిశీలించారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో, ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యంగా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ మళ్లించడంతో కొన్ని ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి, రోడ్లు దెబ్బతినడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని జిల్లా ఎస్పీ గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను నియమించడం, అవసరమైన చోట్ల డైవర్షన్ మార్గాలను స్పష్టంగా సూచించడం, రాత్రి వేళల్లో సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా పండుగ రోజుల్లో ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత రోడ్డు నిర్మాణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి వెంట నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మధుబాబు రోడ్డు సంబందించిన ఇంజనీర్లు తదితర అధికారులు, పాల్గొన్నారు.
