ప్రజాభద్రతే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాచరణ ప్రణాళికతొ ముందుకు సాగాలి
— మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్..
గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్త్ లో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు, సిబ్బందికి రివార్డులు అందచేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్..
జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విజయవంతంగా పూర్తి అయిన నేపథ్యంలో టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డా. శబరీష్ అందరూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా జిల్లా పోలీసింగ్ కార్యాచరణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. ప్రజా పిటిషన్లు, ఫిర్యాదుల పరిష్కారం, నివారణాత్మక పోలీసింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంశాలపై సమీక్షించారు. సైబర్ నేరాలు, POCSO కేసులు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఎస్పీ సూచించారు.

అలాగే CCTV సర్వైలెన్స్, CCTNS వంటి ఆధునిక సాంకేతికత వినియోగం, మద్యం మత్తులో వాహనాల నడపడం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ఉల్లంఘనలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఆస్తి నేరాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, జూదం, ఆర్థిక మోసాలు, భూవివాదాలు, చట్టసువ్యవస్థ సమస్యలు, రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ వంటి అంశాల్లో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పోలీస్ సిబ్బంది ప్రవర్తన, క్రమశిక్షణ, బాధ్యతతో పాటు దర్యాప్తు ప్రక్రియలు మరియు కోర్టు మానిటరింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
అనంతరం మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తిచేసినందుకు గాను జిల్లా ఎస్పీ డా. శబరీష్ పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎన్నికల విధుల్లో నిబద్ధతతో, సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు, భద్రతా చర్యల్లో విశిష్ట సేవలు అందించిన అన్ని స్థాయిల పోలీస్ సిబ్బందికి రివార్డులను మంజూరు చేశారు. టీమ్ వర్క్ వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
