TG-ICCC, రోడ్డు నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్.
నగర ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై కీలక శాఖల’సమన్వయ సమావేశం’ (Convergence Meeting)
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వర్షాకాలపు సవాళ్లు మరియు ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనర్, ఐపీఎస్ గారి అధ్యక్షతన ఈరోజు TG-ICCC నందు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ‘కన్వర్జెన్స్ సమావేశం’ నిర్వహించబడింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ (GHMC), ట్రాఫిక్ పోలీస్, హైదరాబాదు, రాచకొండ & సైబరాబాద్ కమిషనరేట్లు, హైడ్రా (HYDRA), వాటర్ వర్క్స్ మరియు విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:

- ట్రాఫిక్ క్రమబద్ధీకరణ: ప్రధాన జంక్షన్లలో రద్దీని తగ్గించేందుకు రోడ్ల మరమ్మతులు మరియు పెండింగ్లో ఉన్న జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
- వర్షాకాల సవాళ్లు – వాటర్ లాగింగ్: వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై చర్చించారు. మలక్పేట వంటి ప్రాంతాల్లో విజయవంతమైన ‘రోబోటిక్ క్లీనింగ్’ విధానాన్ని అన్ని వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద అమలు చేయాలని నిర్ణయించారు.
- మౌలిక సదుపాయాల మార్పులు: ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న బస్ స్టాప్లను రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉన్న చోటికి మార్చడం, రోడ్డు మధ్యలో ఉన్న సులాబ్ కాంప్లెక్సులను తొలగించడం మరియు పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై చర్చించారు.
- నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి ఇతర స్థలలో కూడా మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయము ఏర్పాట్లు చేయాలని మరియు మల్టీ లెవల్ పార్కింగ్ యాప్” (Multi-level Parking App) ను తీసుకురావాలని నిర్ణయించినారు. శ్రీ వి.సి. సజ్జనర్, ఐపీఎస్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ శాఖలతో సమన్వయ సమావేశాలను పునః ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. “పోలీస్ మరియు మున్సిపల్ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అని పేర్కొన్నారు.
- • శ్రీ ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ కమిషనర్, జీహెచ్ఎంసీ మాట్లాడుతూ: వాటర్ బోర్డు, విద్యుత్ మరియు ఇతర స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. క్షేత్ర స్థాయి అధికారులకు అధికారాలను, బడ్జెట్ను బదిలీ చేస్తామని, దీనివల్ల క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. ప్రతి నెలా క్షేత్రస్థాయి సందర్శనల ద్వారా 80% సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమస్యలను స్వల్పకాలిక (15 రోజులు), మధ్యకాలిక (1-3 నెలలు), దీర్ఘకాలిక (3 నెలల పైబడి) అని వర్గీకరించి పరిష్కరిస్తాం. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి “మల్టీ లెవల్ పార్కింగ్ యాప్” (Multi-level Parking App) ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాయని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా వాహనదారులు తమకు సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించే అవకాశం కలుగుతుంది.
- • శ్రీ ఎ.వి. రంగనాథ్, ఐపీఎస్ కమిషనర్, హైడ్రా మాట్లాడుతూ: వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపుతామని, ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
- • శ్రీ డి. జోయల్ డెవిస్, ఐపీఎస్ జాయింట్ సీపీ, ట్రాఫిక్ హైదరాబాద్ నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను వివరిస్తూ, వాటి పరిష్కారం కోసం ఆయన ఈ క్రింది సూచనలు చేశారు: బస్టాపుల పునర్వ్యవస్థీకరణ: సామాన్య ప్రజలకు మరియు వాహనదారులకు అంతరాయం కలగకుండా బస్టాపులను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న బస్టాండ్లను రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు మార్చడం ద్వారా సమస్యను తగ్గించవచ్చు.
- • సులాబ్ కాంప్లెక్సుల తరలింపు: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే నిర్మించిన సులాబ్ కాంప్లెక్సుల వల్ల ట్రాఫిక్ కు ఆటంకం కలుగుతోంది. వీటిని గుర్తించి అనువైన ఇతర ప్రదేశాలకు తరలించాలి.
- • ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం: పాద చారులు నేరుగా రోడ్లపై నుండి దాటడం వల్ల ట్రాఫిక్ వేగం తగ్గుతోంది. కావున, అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జులను నిర్మిస్తే వాహనాల రాకపోకలు సులువుగా సాగుతాయి.
- • రోబోటిక్ క్లీనింగ్: ఇటీవల వర్షాకాలంలో మలక్పేట వంటి వాటర్ లాగింగ్ (నీరు నిలిచే) పాయింట్ల వద్ద చేపట్టిన ‘రోబోటిక్ క్లీనింగ్’ మంచి ఫలితాలను ఇచ్చింది. ఇదే విధానాన్ని నగరం అంతటా అమలు చేస్తే మేలవుతుంది.
- • రేలింగ్ ఏర్పాటు: పురాణాపూల్, బహదూరాపురా, ఎం.జె. మార్కెట్, మాసాబ్ ట్యాంక్, బేగంపేట వంటి ప్రదేశాలలో రోడ్డు మధ్యలో రేలింగ్ లేకపోవడం వల్ల పాదచారులు, వాహనదారులు విచ్చలవిడిగా రోడ్డు దాటుతున్నారు. ప్రమాదాలను నివారించడానికి మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఈ ప్రాంతాల్లో రేలింగ్ ఏర్పాటు చేయాలి.
- • ఆటో పార్కింగ్ నియంత్రణ: ఉస్మానియా ఆసుపత్రి తో పాటు నగరంలోని ఇతర స్థలాలలో ఆటోలను విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరినారు.
- • శ్రీ గజరావు భూపాల్, ఐపీఎస్ జాయింట్ సీపీ, సైబరాబాద్ మాట్లాడుతూ: రోడ్డు తవ్వకాలు జరిపినప్పుడు ప్యాచ్ వర్క్ ఆలస్యం కాకుండా ఉండేందుకు, తవ్వకం మరియు మరమ్మతు పనులను ఒకే కాంట్రాక్టరుకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
- • శ్రీ అశోక్ రెడ్డి ఎండి, వాటర్ వర్క్స్ మాట్లాడుతూ: హైదరాబాదు నగరములోని “సెవరేజ్ (Sewerage)” మరియు “డ్రైనేజ్ (Drainage)” లను ఇంకా అభివృద్ది చేయడానికి చర్యలు చేపట్టినాము అని తెలిపారు. మరియు అన్ని శాఖలు కలిసి పనిచేసినప్పుడే ట్రాఫిక్ మరియు పాదచారుల సమస్యలు తీరుతాయని, తమ శాఖ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
- “ముఖ్యంగా పట్టణ నివాసితులు స్వీయ స్వచ్ఛతను పాటించాలని, చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, ముఖ్యంగా పాలిథిన్ కవర్లు డ్రైనేజిలో వేయడం మానుకోవాలని మరియు ప్రజలందరు కూడా హైదరాబాదు పట్టణ శుభ్రతపై దృష్టి సారించాలని వక్తలందరు ముక్తకంఠంతో కోరారు”.
- ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ట్రాఫిక్ డీసీపీలు, మరియు హెచ్.ఎం.డి ఎ, జిసిఐ, కంటోన్ మెంట్, హైడ్రా, వాటర్ వర్క్స్ ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

