
నల్లగొండ పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజ్లో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో జిల్లా యస్పి మాట్లాడుతూ, “ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలి” అని, తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మేల్కొనాలని, సీనియర్లు, జూనియర్లు అని బేదం వీడనాడుతూ, “నేటి సీనియర్లు ఒకప్పుడు జూనియర్లు” అనే విషయం మరచిపోవద్దు” అని అన్నారు. తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం, ర్యాగింగ్కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే, 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ర్యాగింగ్ అనగా వ్యక్తులను, మానసికంగా లేదా శారీరకంగా అవమానపరచడం, భయపెట్టడం, భయం కలిగేటట్లు చేయడం, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అనర్దాలు జరుగుతాయని, చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేయబడతాయని చెప్తూ, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తూ “ర్యాగింగ్ అనే భూతాన్ని కళాశాల నుండి తరిమేయాలని” సూచించారు. ఎంతో కష్టపడి చదివి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకొని ర్యాగింగ్ అనే క్షణిక పాశవిక ఆనందానికి చేస్తే, కేసులు నమోదై, జైలు కి వెళ్తే వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కూడా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి నల్గొండ కె శివరాం రెడ్డి, ఎస్బి సిఐ రాము,వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై సైదులు కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
