
బలపాల గ్రామానికి చెందిన సైదమ్మ అనే వృద్ధ మహిళ తన భర్త మరణించి, సంతానం లేక ఒంటరిగా జీవిస్తూ, ఆహారం లేక అనారోగ్యంతో బలపాల బస్టాండ్ సమీపంలో నివసిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కి సమాచారం అందింది. ఎస్పీ ఆదేశాల మేరకు కురవి ఎస్సై గండ్రాతి సతీష్ వెంటనే స్పందించి తన సిబ్బందితో కలిసి బలపాల గ్రామానికి వెళ్లి సైదమ్మను పలకరించి, ఆమెతో మాట్లాడారు. ఆపై మానవత్వాన్ని చాటుతూ ఆమెకు స్నానం చేయించి, కొత్త దుస్తులు వేయించి, అన్నం పెట్టించి, దుప్పట్లు, బట్టలు అందించారు.
తరువాత ఖమ్మంలో ఉన్న అన్నం ఫౌండేషన్ వారితో సంప్రదించి, ఆ సంస్థలో ఆమెను సురక్షితంగా చేర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది PC వీరాస్వామి, PC రమేష్, WPC శివాని పాల్గొని సక్రియంగా సహకరించారు. ఈ సందర్భంగా ఎస్సై గండ్రాతి సతీష్ తన పోలీస్ సేవలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అనాధలకు నిత్యం ఉచితంగా భోజనం అందించే అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలుపుతూ రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మానవతా విలువలను ప్రతిబింబించే ఈ కార్యాచరణ పోలీసు శాఖ సేవాస్ఫూర్తికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

