
జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ రవాణా పై జిల్లా అధికార యంత్రాంగం ఉక్కు పాదం మోపుతోంది. అనుమతి లేకుండా తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వరుస దాడులు కొనసాగుతున్నాయి. అక్రమ రవాణా దారులు పై కేసులు నమోదు చేస్తూ.వాహనాలు సీజ్ చేయిస్తున్నది.
సహజ వనరుల సంరక్షణ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే ఐపీఎస్ జిల్లాలోని సహజ వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు, ప్రణాళిక ప్రకారం తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, నిర్మాణాల కోసం నిబంధనల మేరకు తరలించేందుకు కలెక్టర్ అనుమతి ఇస్తున్నారు.
పదుల సంఖ్యలో వాహనాలు సీజ్: జూలై 21 వ తేదీన ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో హిటాచి యంత్రం, 12 వ తేదీన ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లు, 10వ తేదీన ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లు, జూన్ 28వ తేదీన ఇందిరమ్మ ఇళ్లకు అని వాహనాలకు బ్యానర్ కట్టి వేములవాడ రూరల్ మండలంలోని కొడిముంజ-అనుపురం పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు, 2 జేసిబీలు, 2 హిటాచి యంత్రాలు, అదే నెల 22 వ తేదీన ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో హిటాచీ, జేసీబీ, అలాగే ఒక టిప్పర్ ను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్ల, ఎస్పీ కార్యాలయం కు తరలించారు.
కేసులు నమోదు చేసి జరిమానా విధించి: ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం నిబంధనల మేరకు తరలించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనుమతి ఇస్తున్నారు. నిర్మాణదారులకు ఇసుక, మట్టి కోసం ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన ఇసుక, మట్టి సమకూర్చాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు.
జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ: అనుమతి లేకుండా మొరం, మట్టి తరలిస్తున్న 691 వాహనాలను మైనింగ్ శాఖ ఆద్వర్యంలో సీజ్ చేసి రూ. 1,02,026 జరిమానా విధించారు. అలాగే అధికారికంగా అనుమతి లేకుండా మొరం, మట్టి తవ్వకాలు చేస్తున్న జిల్లాలోని ఆయా మండలాల్లో నలుగురికి రూ. 2,87,515 జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగింది.
ప్రభుత్వ సెలవు రోజుల్లో అనుమతులు ఇవ్వవద్దు: ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ సెలవు దినాల్లో ఇసుక, మట్టి తరలించవద్దని, ఆయా మండలాలకు తెలిపిన ప్రభుత్వ పని దినాలలో మాత్రమే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
