చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశ్రామిక రసాయనాలను ట్యాంకర్ల నుంచి అక్రమంగా బయటకు తీసి, డ్రమ్ముల్లో నిల్వచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 15న వెలిమినేడు గ్రామ శివారులోని రాజస్థాన్ ధాబా వెనుక పార్కింగ్ స్థలంలో తనిఖీలు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి-65పై రవాణా అవుతున్న సాల్వెంట్లు, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, మిథనాల్ తదితర పారిశ్రామిక రసాయనాలను ట్యాంకర్ల నుంచి కొంతమేర అక్రమంగా బయటకు తీసి తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. అనంతరం వాటిని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అరెస్టయిన నిందితులు
- చాపల సత్యనారాయణ @ సతీష్ (32) – వెల్లంకి గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
- బిపిన్ కుమార్ యాదవ్ (35) – ట్యాంకర్ డ్రైవర్, ఉత్తరప్రదేశ్
- నవీన్ కుమార్ (31) – ట్యాంకర్ డ్రైవర్, ఉత్తరప్రదేశ్
- రాకేష్ ప్రసాద్ (45) – కూలీ, ఖాల్సా ధాబా, చిట్యాల మండలం
- అమిత్ కుమార్ (36) – కూలీ, ఖాల్సా ధాబా, చిట్యాల మండలం
ప్రధాన నిందితుడైన సత్యనారాయణ తన సహచరులతో కలిసి ట్యాంకర్ డ్రైవర్లతో కుమ్మక్కై రసాయనాలను కొనుగోలు చేసి, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఐదు వాహనాలు స్వాధీనం
పోలీసులు రెండు బొలెరో వాహనాలు, ఒక మినీ DCM, రెండు కెమికల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు.
- TS-07-UN-1565
- TS-07-UM-0626
- TS-10-UC-4845
- MH-42-AQ-6795
- MH-04-LY-8397
రసాయనాలు, పత్రాలు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి పారిశ్రామిక రసాయనాలతో నింపిన పలు ప్లాస్టిక్ డ్రమ్ములు, రసాయనాలను తరలించేందుకు ఉపయోగించిన పైపులు, ఇతర పరికరాలతో పాటు ట్యాంకర్లకు సంబంధించిన ఇన్వాయిసులు, రవాణా పత్రాలు, ఇతర రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రవాణా కోసం అప్పగించిన పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయించడం ద్వారా సంబంధిత పరిశ్రమలకు ఆర్థిక నష్టం కలిగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది.
ఈ అక్రమ రవాణా, విక్రయాల వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
