హైదరాబాద్: సెల్ఫోన్ చోరీని ఆధారంగా చేసుకుని బాధితుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. సంప్రదాయ పద్ధతిలో ఫోన్ చోరీ చేసి, అనంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్యాంకింగ్ ఖాతాల్లోని నగదును దోచుకుంటున్న వ్యవస్థీకృత ముఠాల వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన లేని వ్యక్తులను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరహా కేసుల దర్యాప్తులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో స్మార్ట్ఫోన్లు ఉపయోగించే వ్యక్తులను నిందితులు ముందుగా గమనిస్తారు. ముఖ్యంగా బాధితులు ఫోన్ను అన్లాక్ చేసే సమయంలో ఉపయోగించే ప్యాటర్న్, పిన్ లేదా పాస్వర్డ్ను వెనుక నుంచి గమనించి గుర్తుపెట్టుకుంటారు. అనంతరం అదును చూసి ఫోన్ను చోరీ చేస్తారు.
ఫోన్ లాక్ అయి ఉండి పాస్వర్డ్ తెలియకపోతే మరో పద్ధతిని ఉపయోగిస్తున్నారు. బాధితుడు తన పోయిన ఫోన్కు కాల్ చేసినప్పుడు నిందితులు ఫోన్ ఎత్తి తాము బస్సు కండక్టర్ లేదా డ్రైవర్ అని పరిచయం చేసుకుంటారు. ఫోన్ బస్సులో దొరికిందని, వచ్చే స్టాప్లో తిరిగి ఇస్తామని నమ్మిస్తారు. ఫోన్ తనదేనని నిర్ధారించుకోవాలనే పేరుతో స్క్రీన్ లాక్ పాస్వర్డ్ను బాధితుడి నుంచే రాబడుతున్నారు.
ఫోన్ అన్లాక్ అయిన తర్వాత అసలు మోసం ప్రారంభమవుతుంది. గ్యాలరీ, నోట్స్, సందేశాలు, వాట్సాప్ చాట్లలోని వ్యక్తిగత సమాచారాన్ని నిందితులు పరిశీలిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ఫొటోలు, ఆధార్, పాన్ కార్డు వివరాలు, బ్యాంక్ పాస్బుక్ సమాచారం, పిన్లు వంటి సున్నితమైన వివరాలను సేకరిస్తారు.
అదే సమయంలో చోరీ చేసిన సిమ్ కార్డు వారి వద్ద ఉండటంతో ఫోన్లోని యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇతర బ్యాంకింగ్ యాప్లను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తారు. ఓటీపీల ఆధారంగా పాస్వర్డ్లు, యూపీఐ పిన్లను రీసెట్ చేసి, బాధితుల ఖాతాల నుంచి నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నగదును నేరుగా తమ ఖాతాల్లోకి బదిలీ చేయకుండా, డిజిటల్ వాలెట్లు, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లు, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా పలు దశల్లో మళ్లించి చివరకు నగదుగా మార్చుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
ఈ ముఠాలు ఒక్కరితోనే పనిచేయడం లేదని, పక్కా వ్యవస్థీకృత నెట్వర్క్గా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రద్దీ ప్రదేశాల్లో బాధితులను గుర్తించేవారు, ఫోన్లు చోరీ చేసేవారు, పాస్వర్డ్లు రాబట్టేవారు, బ్యాంకింగ్ యాప్లను దుర్వినియోగం చేసేవారు, మ్యూల్ ఖాతాల ద్వారా నగదును మళ్లించేవారు వేర్వేరు వ్యక్తులుగా ఉండే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు.
ఫోన్ పోయిన వెంటనే ఏం చేయాలి?
ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ ఎత్తి కండక్టర్, డ్రైవర్ లేదా మరెవరైనా పరిచయం చేసుకున్నా స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్ లేదా బ్యాంకింగ్ ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఫొటోలు, సీవీవీ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, బ్యాంక్ పాస్బుక్ కాపీలు, ఆధార్, పాన్ కార్డు వంటి సున్నితమైన సమాచారాన్ని మొబైల్ గ్యాలరీ లేదా నోట్స్ యాప్లో భద్రపరచవద్దని పోలీసులు సూచించారు.
ఫోన్ పోయిన వెంటనే సంబంధిత టెలికాం సంస్థను సంప్రదించి సిమ్ను బ్లాక్ చేయించాలి. అనంతరం బ్యాంకును సంప్రదించి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి.
అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ఐఎంఈఐ నంబర్ను నమోదు చేసి పరికరాన్ని బ్లాక్ చేయించాలి. ఖాతా నుంచి అనధికారికంగా నగదు బదిలీ అయినట్లు గుర్తిస్తే వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలి. సైబర్ నేరాలపై అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లోనూ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
కుటుంబాల్లోని యువత తమ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లకు ఈ తరహా సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో మొబైల్ ఉపయోగించే సమయంలో పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
