సంగారెడ్డి జిల్లా, ఆగస్టు 26: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., ముస్లిం మత పెద్దలు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముస్లిం మత పెద్దలు, ర్యాలీ నిర్వాహకులతో పీస్ మీటింగ్ నిర్వహించారు. ర్యాలీలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవించుకున్నప్పుడే సమాజంలో మత సామరస్యం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఫేక్ మెసేజ్లను నమ్మొద్దు
వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అయ్యే ఫేక్ న్యూస్, ఫార్వర్డ్ మెసేజ్లను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ సూచించారు. తమకు వచ్చిన ఏదైనా సందేశం నిజమా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు ఫార్వర్డ్ చేయాలని తెలిపారు.
అనుమానాస్పదమైన మెసేజ్లు లేదా సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తే వాటిపై స్పందించకుండా సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫార్వర్డ్ మెసేజ్ల ద్వారా అనవసర గొడవలు, అల్లర్లకు కారణమయ్యే విధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు.
ప్రజలు, మత పెద్దలు, ర్యాలీ నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తూ ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు కోరారు.
