నల్లగొండ: కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపల్ను హత్య చేసింది ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. గంజాయికి అలవాటు పడటంతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఈ నెల 11న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఆమె స్కూల్ నుంచి ఇంటికి చేరుకునేలోపే నిందితులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి, వంటగదిలో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి ఇంటి తాళం తీసుకుని లోపలికి వెళ్లిన తర్వాత ఫ్రెష్ అయి బెడ్రూమ్లోకి వెళ్లగా.. నిందితులు వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ దాడిలో రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఆమె హ్యాండ్బ్యాగ్లో ఉన్న సుమారు రూ.2 లక్షలను తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు.
హత్య అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించేందుకు, సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తీసుకెళ్లిన డబ్బుతో హైదరాబాద్లో జల్సాలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి చివరకు ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
