క్రికెట్ అనే క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన #SayNoToBettingApps ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అనేక బెట్టింగ్ యాప్లను నిషేధించిందని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం బెట్టింగ్ ముఠాలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయని ఆయన వెల్లడించారు. యాప్లపై నిషేధం వచ్చిన తరువాత టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త వెబ్సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేవలం ఆన్లైన్ మాత్రమే కాకుండా, నగర పరిసరాల్లోని ఇళ్లలో, ఫామ్ హౌస్లలో రహస్యంగా సమావేశమై ఫోన్ల ద్వారా ఆఫ్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారని సమాచారం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఇటువంటి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక బుకీలు యువతను ఆకర్షించి అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని, అవసరమైతే ఇటువంటి నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ చివరికి పెద్ద నష్టాలకు దారితీస్తుందని, బెట్టింగ్లో లాభపడేది నిర్వాహకులే కానీ ఆడేవారు తమ సంపాదన మొత్తాన్ని కోల్పోతారని ఆయన వివరించారు. ఒకసారి ఈ వ్యసనానికి బానిసలైతే కుటుంబాలు ఆర్థిక, మానసిక సమస్యలను ఎదుర్కొని తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
ప్రజలు క్రికెట్ను కేవలం వినోదంగా మాత్రమే ఆస్వాదించాలని, దాన్ని జూదంగా మార్చుకోవద్దని సూచించారు. నగరాన్ని మరియు యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.
అదేవిధంగా, పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గమనించినా, లేదా ఎవరో బెట్టింగ్కు ప్రోత్సహిస్తున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు సమాచారాన్ని అందించాలని సూచించారు.
ఈ హెచ్చరికలతో నగరంలో బెట్టింగ్ ముఠాలపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశముంది.
