సంగారెడ్డి జిల్లా భరోసా సెంటర్ మరింత సమర్థవంతంగా పని చేసేందుకు జిల్లా అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: పోక్సో, అత్యాచార కేసులలో బాధితులకు భరోసా సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు జిల్లా స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పోక్సో, అత్యాచార కేసులో పోలీస్, ఆరోగ్య, న్యాయ, మహిళా & శిశు సంక్షేమ శాఖలు సమిష్టిగా కృషి చేసి, మెడికో–లీగల్, న్యాయ, షెల్టర్ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శాఖల మధ్య సమాచార మార్పిడి వేగవంతంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సమిష్టిగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులకు తెలియజేశారు. యువతలో ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్, అపరిచితులతో ఆన్లైన్ పరిచయాలు పోక్సో, అత్యాచార నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మహిళలు, పిల్లల భద్రత విషయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

అనంతరం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సౌజన్య మాట్లాడుతూ, యవ్వన దశలో కలిగే ఆకర్షణలు, వాటి వల్ల జరిగే అనర్థాలపై విద్యాసంస్థల్లో అన్ని శాఖల మధ్య సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. పోక్సో, అత్యాచార కేసులలో బాధితులకు అవసరమైన అన్ని రకాల న్యాయ సేవలను సకాలంలో అందించేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భరోసా నోడల్ అధికారి/అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎం & హెచ్ఓ వసంత రావు, భరోసా ప్రోగ్రామ్ మేనేజర్ రేంజి జోసెఫ్, భరోసా డీఎస్పీ శ్రీధర్, జిల్లా డీఎస్పీలు సత్యయ్య, సైదా, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, సీడబ్ల్యూసీ కృష్ణమూర్తి, సీడీపీఓ రత్నం, విద్యాశాఖ ఏఓ వెంకటేశం, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, భరోసా సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
