పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. మండపాలకు జియో-ట్యాగింగ్, సీసీ కెమెరాల నిఘా
సోషల్ మీడియా వదంతులపై 24 గంటల పర్యవేక్షణ
వినాయక చవితి, నిమజ్జన సన్నాహక సమావేశంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆదేశాలు
హైదరాబాద్: రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను నగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశించారు.
గణేష్ ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై శనివారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ఎస్సై స్థాయి నుంచి పైస్థాయి పోలీస్ అధికారులతో సీపీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ డీసీపీలు తమ పరిధిలో చేపడుతున్న భద్రతా చర్యలు, ఇతర శాఖలతో సమన్వయం, బందోబస్తు ప్రణాళికలను వివరించారు.
అనంతరం సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, ఇటీవల ముగిసిన బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన తరహాలోనే వినాయక ఉత్సవాలను కూడా సమష్టి కృషితో ప్రశాంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పదకొండు రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను అత్యంత సీరియస్గా తీసుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మండపాల వద్ద ప్రత్యేక భద్రత
నగరంలో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు క్షేత్రస్థాయిలో ఎస్హెచ్ఓలు శాంతి కమిటీలు, మండపాల నిర్వాహకులు, వివిధ శాఖల ప్రతినిధులతో నిరంతరం సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సీపీ సూచించారు. సాధారణ కార్యక్రమాలు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన యాప్లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాలకు సంబంధించిన వివరాలను నిర్దేశిత యాప్లో తప్పనిసరిగా జియో-ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు.
రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్టార్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
నిమజ్జన మార్గాలపై ప్రత్యేక దృష్టి
శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లను హైదరాబాద్ సిటీలో కలపడంతో బాలాపూర్ నుంచి ఖైరతాబాద్ వరకు గణేష్ ఉత్సవాలు నగర పోలీస్ పరిధిలోకి వచ్చాయని సీపీ తెలిపారు. బాలాపూర్ నుంచి ప్రారంభమై ప్రధాన నిమజ్జన మార్గాల గుండా ట్యాంక్బండ్, ఇతర జలాశయాల వరకు వెళ్లే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
భారీ విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఎత్తు ఎక్కువగా ఉన్న విగ్రహాల వల్ల విద్యుత్ తీగలకు ప్రమాదం కలగకుండా ముందుగానే రూట్ క్లియరెన్స్ పూర్తి చేయాలని సూచించారు.
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దుల నుంచి వచ్చే విగ్రహాల రాకపోకలపై ఆయా కమిషనరేట్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఖైరతాబాద్ బడా గణేష్ వంటి భారీ రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు.
సోషల్ మీడియాపై 24 గంటల నిఘా
పండుగ వేళ సమాజంలో విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, వదంతులపై ఐటీ సెల్, స్థానిక పోలీసులు 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగిస్తారని సీపీ తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై, రెచ్చగొట్టే కంటెంట్ను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం
రాబోయే నెల రోజులు ఎంతో కీలకమని పేర్కొన్న సీపీ.. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని సూచించారు. విధుల్లో ఉండే సిబ్బంది ప్రజలు, భక్తులతో సంయమనం, ఓర్పుతో వ్యవహరించాలని ఆదేశించారు.
సమావేశంలో ఎం. శ్రీనివాస్ (అడిషనల్ సీపీ, క్రైమ్స్ & సిట్), తఫ్సీర్ ఇక్బాల్ (అడిషనల్ సీపీ, లా & ఆర్డర్), ఎస్.ఎం. విజయ్ కుమార్ (జాయింట్ సీపీ, స్పెషల్ బ్రాంచ్), వివిధ జోన్ల డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
