హైదరాబాద్ (సెప్టెంబర్ 05):
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు, ప్రధాన నిందితుడు మహ్మద్ జావేద్ అలియాస్ హెక్లా జావేద్తో పాటు అతని సహచరులు మహ్మద్ అబ్దుల్లా, షేక్ ఆరిఫ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తమ్ముడి మరణానికి ప్రతీకారంగానే…
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 19, 2024న కర్ణాటకలో ప్రధాన నిందితుడు మహ్మద్ జావేద్ తమ్ముడు సాజిద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ మరణానికి అబ్దుల్ రవూఫే కారణమని జావేద్ గట్టిగా నమ్మాడు. దీనికితోడు రవూఫ్ తరచూ జావేద్ను బెదిరించడం, హేళన చేస్తుండటంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలని పక్కా వ్యూహం రచించారు.
కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి, కత్తులతో నరికి…
సెప్టెంబర్ 02 రాత్రి 11:00 గంటల సమయంలో రవూఫ్ తన ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యంలో ముగ్గురు నిందితులు అడ్డుకున్నారు. ముందుగా పథకం ప్రకారం రవూఫ్ కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి, కదలకుండా చేసి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావమైన రవూఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు నేరానికి ఉపయోగించిన ఆయుధాలు, రక్తపు మరకల బట్టలు, పెప్పర్ స్ప్రే బాటిళ్లను పల్లె చెరువు సమీపంలోని పొదల్లో దాచిపెట్టి పరారయ్యారు.
కర్ణాటకకు పారిపోతుండగా అరామ్ఘర్ వద్ద పట్టివేత:
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మైలార్దేవ్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సెప్టెంబర్ 04 ఉదయం 6:00 గంటల సమయంలో నిందితులు అరామ్ఘర్ మీదుగా కర్ణాటకలోని బసవకల్యాణ్కు పారిపోయేందుకు యత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి మృతుడి మొబైల్ ఫోన్, హత్యకు వాడిన మారణాయుధాలు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడిపై 180 కేసులు:
దర్యాప్తులో నిందితుల నేర చరిత్ర పోలీసులనే విస్మయానికి గురిచేసింది:
- మహ్మద్ జావేద్ (హెక్లా జావేద్): హైదరాబాద్, పరిసర జిల్లాలు మరియు కర్ణాటక పరిధిలో ఏకంగా 180 క్రిమినల్ కేసుల్లో నిందితుడు.
- షేక్ ఆరిఫ్: గతంలో నమోదైన 3 కేసులు.
- మహ్మద్ అబ్దుల్లా: 1 క్రిమినల్ కేసు.
నిందితులందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వేగంగా స్పందించి నిందితులను పట్టుకున్న పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
