జిల్లా కేంద్రం: ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 17 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయా ఫిర్యాదులకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ, బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి వినతులు, ఫిర్యాదులను శ్రద్ధగా స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీంతో ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం, భరోసా మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ప్రజలు గ్రీవెన్స్ డే వేదికగా నేరుగా తమ సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, అందిన ప్రతి ఫిర్యాదును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
